మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో... భారత్‌కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, భారత ఇంధన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు చెందిన రెండు భారీ చమురు నౌకలు భారత్‌కు చేరుకున్నాయి. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం, నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఈ నౌకలు గుజరాత్‌లోని సిక్కా పోర్టులో లంగరేశాయి. మార్చి మధ్యలో ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరిన ఈ నౌకలు, సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చినట్లు సమాచారం. అయితే, ఈ చమురును ఏ భారతీయ సంస్థ కొనుగోలు చేసిందనే విషయంపై ప్రస్తుతానికి గోప్యత కొనసాగుతోంది.


2019లో అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేసింది. కానీ, ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని గుర్తించిన అగ్రరాజ్యం, ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను కొంతమేర సడలించింది. ముఖ్యంగా సముద్ర జలాల్లో నిలిచిపోయిన ఇరాన్ చమురు నౌకలను కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతించడంతో, ఈ సరఫరా మళ్లీ పునరుద్ధరణకు నోచుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమై, హర్మూజ్ జలసంధి దిగ్బంధన ముప్పు పొంచి ఉన్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.


ప్రపంచంలోనే చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో అతిపెద్ద దేశమైన భారత్, తన ఇంధన అవసరాల కోసం వైవిధ్యమైన మార్గాలను అన్వేషిస్తోంది. రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు చేసుకుంటున్న తరుణంలోనే, ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా సరఫరా మొదలవ్వడం దేశ ఇంధన భద్రతకు ఊరటనిచ్చే అంశం. ఒకవైపు ట్రంప్ యంత్రాంగం, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న వార్తలు వస్తున్నప్పటికీ, భారత్ తన వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇంధన కొరతను అధిగమించేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ చమురు రాక ప్రాముఖ్యతను సంతరించుకుంది.


Iran oil
India Iran relations
Iran crude oil
Sikka Port
oil imports India
India energy security
Hormuz Strait
oil tankers
US sanctions Iran

More Telugu News